హైదరాబాద్ మహానగర రవాణా ముఖచిత్రాన్ని మార్చే కీలకమైన మెట్రో రైలు ఫేజ్-II ప్రాజెక్టుకు తక్షణమే ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏడు కారిడార్లతో రూపొందించిన మెట్రో రెండో దశ సమగ్ర ప్రాజెక్టు నివేదికను (DPR) కేంద్ర మంత్రికి అందజేస్తూ.. వేగంగా విస్తరిస్తున్న నగరాభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ ఎంతో అవసరమని వివరించారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-II విస్తరణ సజావుగా సాగాలనే లక్ష్యంతోనే మెట్రో మొదటి దశను ఎల్ అండ్ టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఫేజ్-I ప్రభుత్వం ఆధీనంలో ఉండటంతో.. ఫేజ్-II మరియు ఫేజ్-III పనుల విస్తరణ మరింత సులభమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఫేజ్-IIలో భాగంగా మొత్తం 122.9 కిలోమీటర్ల మేర ఏడు కారిడార్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. సుమారు రూ. 38,595 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ భారీ ప్రాజెక్టును కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా చేపట్టాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
నగర భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు ఉన్న కారిడార్ను మెట్రో ఫేజ్-III కింద చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి సూచించారు. దీనికి సంబంధించిన డీపీఆర్ను కూడా ఇప్పటికే కేంద్రానికి సమర్పించినట్లు ఆయన గుర్తు చేశారు. రాజధాని చుట్టూ మెట్రో అనుసంధానాన్ని పెంచడం ద్వారా ట్రాఫిక్ కష్టాలు తగ్గడమే కాకుండా.. ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగవంతం అవుతాయని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించి త్వరగా ఆమోదముద్ర వేయాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం భాగస్వామిగా ఉంటే ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయగలమని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కీలక సమావేశంలో కేంద్ర గృహనిర్మాణ.. పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి కె. శ్రీనివాస్.. ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి బి. అజిత్ రెడ్డి.. హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ పాల్గొన్నారు. వీరితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎన్.వి.ఎస్. రెడ్డి.. ఢిల్లీ తెలంగాణ భవన్ ప్రత్యేకాధికారి సంజయ్ కుమార్.. అద్వైత్ కుమార్ సింగ్ కూడా హాజరై ప్రాజెక్టులోని సాంకేతిక అంశాలను కేంద్రానికి వివరించారు.








