తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రత్యక్ష రాజకీయ పోరాటానికి సిద్ధమయ్యారు. పార్టీ స్థాపన తర్వాత ఆమె తన తొలి రాజకీయ అడుగును పాలమూరు గడ్డ నుంచే వేయాలని నిర్ణయించుకున్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తడమే లక్ష్యంగా ఈనెల 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భారీ బహిరంగ సభకు శ్రీకారం చుట్టారు. గతంలో ప్రకటించిన విధంగానే జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు తీసుకుని తన ఉద్యమ ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. 8వ తేదీ ఉదయం ఆలయ దర్శనం అనంతరం సాయంత్రం పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభలో ఆమె పాల్గొంటారు.
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో అత్యంత కీలకమైన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సమీపంలోని చౌదరిగూడెం వద్ద ఈ బహిరంగ సభ జరగనుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 12 ఏళ్లు గడిచినా కృష్ణా జలాల వినియోగంలో వెనుకబడి ఉండటంపై కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలకుల లోపభూయిష్ట విధానాల వల్లే మన నీళ్లు మనకు దక్కడం లేదని ఆమె ఆరోపిస్తున్నారు. కృష్ణా.. గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకుని బీడు భూములకు మళ్లించేలా స్పష్టమైన విధానాన్ని ఈ సభ ద్వారా ఆమె ప్రజల ముందుకు తీసుకురానున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదట శంకుస్థాపన చేసిన పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఇంకా 50 శాతం కూడా పూర్తి కాకపోవడంపై కవిత విస్మయం వ్యక్తం చేశారు. గతంలో నిర్వహించిన ‘జనంబాట’ కార్యక్రమంలోనే ప్రాజెక్టు జాప్యంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచి ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు సాధించేలా ఉద్యమ ప్రణాళికను సిద్ధం చేశారు. రంగారెడ్డి జిల్లాకు నీళ్లు అందించే మూడు ప్యాకేజీల పనులు 11 ఏళ్లుగా ప్రారంభం కాకపోవడం పట్ల ఆమె పోరాటానికి సిద్ధమయ్యారు. హక్కుగా దక్కాల్సిన ప్రతి నీటి చుక్కను తెలంగాణ భూములకు మళ్లించేలా తమ పార్టీ కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు.
ఈ బహిరంగ సభకు సంబంధించిన గోడ పత్రికను బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు విడుదల చేశారు. తెలంగాణ రక్షణ సేన నాయకులు నవీన్ ఆచారి, గొంగళ్ల రంజిత్ కుమార్, సయ్యద్ ఇస్మాయిల్, నరేశ్ ప్రజాపతి, ఎదురుగట్ల సంపత్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాలమూరు గడ్డపై నిర్వహించే ఈ సభ ద్వారా తెలంగాణ రాజకీయాల్లో కొత్త వేడి పుట్టనుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సాధనే లక్ష్యంగా కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు.








