AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతారా..? కేంద్రం ఏం చెబుతోందంటే…!

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన ధరలు పెరుగుతాయనే ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను పెంచే ప్రతిపాదన ఏదీ లేదని మంగళవారం స్పష్టం చేసింది. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది.

 

ఈ విషయంపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మార్కెట్లలో పరిణామాలను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని తెలిపారు. “దేశంలో ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ సరిపడా పరిమాణంలో అందుబాటులో ఉన్నాయి. ధరలు పెరగలేదు. కాబట్టి ఎవరూ ఆందోళన చెందవద్దు,” అని ఆమె విజ్ఞప్తి చేశారు.

 

పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ముడి చమురు, ఎల్పీజీ, పీఎన్‌జీ దిగుమతులపై ప్రభావం పడిన మాట వాస్తవమేనని, అయితే సరఫరాలో అంతరాయాలు కలగకుండా చర్యలు తీసుకున్నామని శర్మ వివరించారు. గృహ వినియోగదారులకు, రవాణాకు ఉపయోగించే సీఎన్‌జీకి 100 శాతం సరఫరాను నిర్ధారించినట్లు తెలిపారు. వాణిజ్య ఎల్పీజీ సరఫరాపై పాక్షిక ప్రభావం పడినా, ప్రస్తుతం 70 శాతానికి పునరుద్ధరించామని, ఆసుపత్రులు, విద్యా సంస్థల వంటి కీలక రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.

 

వలస కార్మికులు ఎక్కువగా ఉపయోగించే 5 కిలోల ఎల్పీజీ సిలిండర్ల సరఫరాను దాదాపు రెట్టింపు చేసినట్లు ఆమె వెల్లడించారు. ఫార్మా, స్టీల్, వ్యవసాయం వంటి కీలక పరిశ్రమలకు ఇంధన కొరత రాకుండా చూస్తున్నామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

ANN TOP 10