పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హుగ్లీ జిల్లా బాలాగర్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భారీ బహిరంగసభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర భద్రత, ఆర్థిక వ్యవస్థపై అక్రమ వలసల ప్రభావాన్ని ఎండగట్టారు.
బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం రాగానే ఒక్కరిని కూడా అక్రమంగా సరిహద్దు దాటి రానివ్వబోమని, ఇప్పటికే ఉన్న వారిని గుర్తించి పంపించివేస్తామని స్పష్టం చేశారు. స్థానిక యువతకు దక్కాల్సిన రేషన్, ఉద్యోగాలను ఈ అక్రమ వలసదారులు లాగేసుకుంటున్నారని, ఇది రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఆటంకమని ఆరోపించారు.
మీరు వేసే ఓటు కేవలం ఒక ఎమ్మెల్యే కోసమే కాదని, అక్రమ చొరబాటుదారుల నుంచి బెంగాల్ విముక్తి కోసం కూడా అని పేర్కొన్నారు. మే 5వ తేదీతో ‘దీదీ’ పాలన ముగుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
నేడు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి తొలి దశ (152 స్థానాలు) పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల సమయానికే దాదాపు 89 శాతానికి పైగా భారీ ఓటింగ్ నమోదైంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.








