రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ బిట్స్ పిలానీ క్యాంపస్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో బిట్స్ పిలానీ ప్రతినిధులు సమావేశమై క్యాంపస్ నిర్మాణ పురోగతిని వివరించారు. 2027 నుంచి అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నట్టు వారు ముఖ్యమంత్రికి తెలిపారు.
రాజధానిలో నిర్మిస్తున్న ఈ క్యాంపస్ను ఒక ‘ఐకానిక్, ఏఐ క్యాంపస్’గా తీర్చిదిద్దుతున్నామని ప్రతినిధులు వెల్లడించారు. ఇందులో క్వాంటం టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి ఆధునిక విభాగాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, క్వాంటం టెక్నాలజీ రంగంలో స్టార్టప్లను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
బిట్స్ పిలానీ అమరావతి క్యాంపస్ను మూడు దశల్లో నిర్మిస్తున్నామని, మొత్తం 10 వేల మంది విద్యార్థులు చదువుకునేలా దీనిని అభివృద్ధి చేస్తున్నామని ప్రతినిధులు వివరించారు. ఈ క్యాంపస్తో పాటు సంస్థ విస్తరణకు మొత్తం రూ.250 కోట్ల మేర వ్యయం చేయనున్నట్లు వారు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ సమావేశంలో క్యాంపస్ నిర్మాణం, భవిష్యత్ ప్రణాళికలపై సమగ్రంగా చర్చించారు.








