వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన కొత్త రాజధాని మావిగన్ ప్రతిపాదనను మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గడివాడ అమర్ నాథ్ సమర్థించారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. వైసీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ అయిన కన్నబాబు మాట్లాడుతూ .. జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదనతో రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడిందన్నారు. జగన్ మాట ఎంత పవర్ ఫుల్లో మరోమారు నిరూపితమైందని చెప్పారు.
అమరావతి అవినీతిపై జగన్ ఎక్కుపెట్టిన గన్ లా మావిగన్ కూటమి నేతలకు కనిపించిందన్నారు. అసలు జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదనలో తప్పు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తే.. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అభివృద్ధి చెందుతాయని కన్నబాబు అన్నారు. వైఎస్ జగన్ తిరిగి ఎక్కడ అధికారంలోకి వస్తారోనన్న భయం సీఎం చంద్రబాబును వెంటాడుతోందని కన్నబాబు ఎద్దేవా చేశారు.
వైసీపీ పాలనలో అమరావతి కోసం జగన్ రూ.8 వేల కోట్లు ఖర్చు చేశారని.. కానీ పైసా ఖర్చు చేయలేదన్నట్లు కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పై కడుపు మంటతో తప్పుడు రాతలు రాస్తున్నారని విమర్శించారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ రేణుక చౌదరి అమరావతిని కమరావతి పిలుస్తున్నారని కన్నబాబు గుర్తుచేశారు. అది నిజంగా అందరి అమరావతే అయితే ఎందుకు రేణుక చౌదరి మాటలను ఖండించలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు.
మరోవైపు మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ సైతం.. మావిగన్ ప్రతిపాదనకు మద్దతుగా మాట్లాడారు. ‘మావిగన్ అనేది గ్రోత్ కారిడార్’ అని ప్రశంసించారు. ‘మచిలీపట్నంలో 5500 కోట్లతో పోర్ట్ నిర్మాణం జరుగుతోంది. పోర్ట్ నిర్మాణానికి వైఎస్ జగనే శంకుస్థాపన చేశారు. మావిగన్ పేరుకు వ్యతిరేకమా? మచిలీపట్నం – విజయవాడ – గుంటూరు అభివృద్ధికి వ్యతిరేకమా? అనేది చంద్రబాబు చెప్పాలి’ అని అమర్ నాథ్ పట్టుబట్టారు.
ఏపీ మినహా దేశంలోని ఏ రాష్ట్రం కూడా తన రాజధానికి చట్టబద్దత చేయాలని తీర్మానం చేయలేదని అమర్ నాథ్ అన్నారు. చంద్రబాబు అవినీతికి చట్ట బద్దతత తీసుకురావడం కోసమే ఈ తీర్మానమని ఆరోపించారు. తాము ఎన్నడూ అమరావతికి వ్యతిరేకం కాదని.. అభివృద్ధి పేరుతో అక్కడ జరుగుతున్న దోపిడికే తాము వ్యతిరేకమని మాజీ మంత్రి అమర్ నాథ్ స్పష్టం చేశారు. అమరావతి దేశంలోనే అతిపెద్ద స్కామ్ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.








