తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న కొద్ది గంటల్లో వాతావరణం వేగంగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అకస్మాత్తుగా మారుతున్న ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలోని రుద్రారం, సదాశివపేట, పాశమైలారం, కంది, ఇస్నాపూర్ వంటి ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వడగళ్ల వాన పడే అవకాశం ఉంది. అలాగే ఖమ్మం, సిరిసిల్ల, వరంగల్, మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. పిడుగులు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని స్పష్టం చేశారు.
రాజధాని హైదరాబాద్లో కూడా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నగరంలోని పలు చోట్ల బలమైన గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాహనదారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల ప్రభావం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు.








