ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ రాకతో దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. తమ అభిమాన ఆటగాడిని చూసేందుకు ఫుట్బాల్ ప్రేమికులు భారీ సంఖ్యలో అరుణ్ జైట్లీ స్టేడియానికి తరలివచ్చారు. ఉదయం నుంచే స్టేడియం వెలుపల అభిమానులు బారులు తీరడంతో ఆ ప్రాంతమంతా అర్జెంటీనా జెర్సీ రంగులైన నీలం, తెలుపుమయంగా మారింది. బ్యానర్లు, జెండాలు చేతబూని అభిమానులు ‘మెస్సీ.. మెస్సీ’ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
భారీగా తరలివచ్చిన అభిమానులను అదుపు చేసేందుకు అధికారులు అదనపు సిబ్బందిని మోహరించి పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. షెడ్యూల్ కంటే ముందుగానే గేట్లు తెరవడంతో అభిమానులు క్రమపద్ధతిలో లోపలికి వెళ్లగలిగారు. మెస్సీ మైదానంలోకి అడుగుపెట్టగానే స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో దద్దరిల్లింది. ఏడుసార్లు బాలోన్ డి’ఓర్ విజేత అయిన మెస్సీని ప్రత్యక్షంగా చూడటం తమ జీవితంలో మర్చిపోలేని అనుభూతిగా అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.
నిజానికి, పొగమంచు కారణంగా మెస్సీ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం ఆలస్యమైంది. మధ్యాహ్నం ఢిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే మెస్సీ నేరుగా లీలా ప్యాలెస్ హోటల్కు చేరుకున్నారు. అక్కడ ఎంపిక చేసిన కొంతమందితో గంటపాటు మీట్ అండ్ గ్రీట్ సెషన్లో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఒక ప్రదర్శన మ్యాచ్, చిన్నారులకు ఫుట్బాల్ క్లినిక్, పలు ప్రైవేట్ సమావేశాల్లో పాల్గొననున్నారు.









