AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వైజాగ్‌లో వరల్డ్ కప్..!

ఆంధ్రప్రదేశ్‌లోని క్రికెట్ అభిమానులకు శుభవార్త. 2025లో జరిగే మహిళల క్రికెట్ ప్రపంచకప్‌కు విశాఖపట్నం కూడా ఓ ముఖ్య వేదికగా నిలవనుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా నగరంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో మొత్తం ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కడంపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) హర్షం వ్యక్తం చేసింది.

 

ఈ సందర్భంగా ఏసీఏ ప్రధాన కార్యదర్శి సానా సతీశ్, ఇతర సభ్యులతో కలిసి ప్రపంచకప్ ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ టోర్నీలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి బలమైన మహిళా జట్లు విశాఖలో తలపడనున్నాయని ఆయన తెలిపారు. విశాఖలో అక్టోబరు 9న జరగనున్న తొలి మ్యాచ్‌కు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని సానా సతీశ్ వెల్లడించారు.

 

“రాష్ట్రంలో మహిళా క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మంత్రి లోకేశ్ ఈ కార్యక్రమానికి వస్తున్నారు” అని ఆయన పేర్కొన్నారు. కేవలం క్రికెట్‌కే పరిమితం కాకుండా ఇతర క్రీడల్లోనూ మహిళలను ప్రోత్సహించేందుకు ఏసీఏ కృషి చేస్తుందని సతీశ్ హామీ ఇచ్చారు. కాగా, విశాఖలో జరగనున్న తొలి ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు, దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ అంతర్జాతీయ టోర్నీ ఆతిథ్యం రాష్ట్రంలో మహిళా క్రికెట్ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని క్రీడా వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

ANN TOP 10