తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ఈ దిశగా కసరత్తును ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రి సీతక్క చేసిన ప్రకటన ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. జూలై నెలలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
శుక్రవారం మహబూబాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ, “రాబోయే జూలై నెలలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నాం. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది” అని తెలిపారు. ఈ ఎన్నికల్లో అన్ని గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని, ఇందుకోసం పార్టీలోని పాత, కొత్త నేతల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆమె పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదివరకే పలుమార్లు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. వివిధ జిల్లాల నేతలతో జరిగిన సమావేశాల్లో జూలైలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని, అందుకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించినట్లు సమాచారం.