సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇన్ఫ్లుయెన్సర్ల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. సోషల్ మీడియాలో పాపులారిటీ ఉందని అడ్డగోలుగా వ్యవహరిస్తామంటూ చట్టాలు చూస్తూ ఊరుకోవన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియాలో ఫాలో కావద్దన్నారు. వెంటనే అలాంటి వారిని అన్ ఫాలో చేయాలని సూచించారు. “సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు అకౌంటబులిటీ అనేది ఉండాలి. అవాస్తవాలతో అమాయకులను బలి చేసే వారి విషయంలో కఠిన చట్టాలు అమలు చేయాలి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లను వెంటనే అన్ ఫాలో చేయాలి” అని నెటిజన్లకు సజ్జనార్ సూచించారు. ఈ మేరకు ఇన్ స్టాలో పోస్టు పెట్టిన ఆయన #SayMoToBettingApps అని ట్యాగ్ లైన్ పెట్టారు.
బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా ప్రచారం
గత కొద్ది వారాలుగా ఐపీఎస్ అధికారి సజ్జనార్ సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ పేరుతో అమాయకుల జీవితాలతో ఆటలాడుతున్న వారి భాగోతాలను బయటపెడుతున్నారు. రీసెంట్ గా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న భయ్యా సన్నీ యాదవ్ అనే ఇన్ఫ్లుయెన్సర్లపై నిప్పులు చెరిగారు. ఈజీగా డబ్బులు సంపాదించే అవకాశం ఉందంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోపై సీరియస్ గా స్పందించారు. “కాసులకు కక్కుర్తి పడి ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లూ యెన్సర్లరా.. ఇక మీ ఆటలు ఎక్కువ రోజులు సాగవు. మీ వికృత చేష్టలు ఇకనైనా ఆపకపోతే చట్ట ప్రకారం శిక్షలు అనుభవిస్తారు” అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సజ్జనార్ వ్యాఖ్యల నేపథ్యంలో సన్నీ యాదవ్ మీద సూర్యాపేట జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. అటు ఇతర బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల మీద కూడా సజ్జనార్ నిప్పులు చెరుగుతున్నారు.
నా అన్వేషణ అన్వేష్ తో బెట్టింగ్ యాప్ వ్యతిరేక ప్రచారం
వీసీ సజ్జనార్ కు మద్దతుగా ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అన్వేష్ బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా ప్రమోషన్ చేయిస్తున్నారు. సోషల్ మీడియాలో మంచి గుర్తింపు ఉన్న అన్వేష్.. గత కొద్ది రోజులుగా సజ్జనార్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా ఇద్దరూ కలిసి ఈ యాప్స్ కు వ్యతిరేకంగా నెటిజన్లలో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. కాసుల కోసం కక్కుర్తి పడి ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లకు, ఇన్ ఫ్లుయెన్సర్లకు సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన చాలా మంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, తీరు మార్చుకోకపోతే జైల్లో ఊచలు లెక్కించతప్పదన్నారు.