AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు.. కిలోల కొద్దీ బంగారం.. రెవెన్యూ అధికారి బాగోతం

ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు.. కిలోల కొద్దీ బంగారు నగలు.. ఇక బ్యాంకు అకౌంట్లలో కోట్లలోనే బ్యాంకు బ్యాలెన్సులు.. ఇదంతా ఓ రెవెన్యూ అధికారి అవినీతి భాగోతం. అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు ఈ భారీ అవినీతి తిమింగలం చిక్కింది. నిజామాబాద్ మున్సిపల్‌ సూపరింటెండెంట్‌గా ఉన్న దాసరి నరేందర్‌‌పై వచ్చిన అవినీతి ఆరోపణల మేరకు.. ఆయన నివాసంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అధికారులు నిర్వహించిన ఈ తనిఖీల్లో అధికారులు కళ్లు బైర్లు కమ్మేలా సొత్తు బయటపడింది. భారీగా డబ్బు, బంగారం లభించింది.

శుక్రవారం రోజున (ఆగస్టు 09న) ఉదయం 5 గంటల నుంచి సోదాలు చేయగా.. సాయంత్రం వరకు 7 కోట్లకు పైచిలుకు అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. అవినీతి అక్రమాలతో నరేందర్.. భారీగా ఆస్తులు కూడబెట్టాడని పెద్ద ఎత్తున ఆరోపణలు రావటంతో.. నిజామాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు ఆయన నివాసంపై సోదాలు నిర్వహించారు. ఇంటితో పాటు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, కోటగల్లి, నిర్మల్‌లోని నరేందర్‌కు సంబంధించిన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

నరేందర్ ఇంట్లో.. ఏకంగా 2 కోట్ల 93 లక్షల 81 వేల రూపాయల డబ్బు కట్టలు బయటపడ్డాయి. ఇంట్లో ఉన్న నోట్ల కట్టలు చూసి అవాక్కవటం ఏసీబీ అధికారుల వంతైంది. ఆ నోట్ల కట్టలను లెక్కించేందుకు ప్రత్యేకంగా క్యాష్ కౌంటింగ్ మిషిన్లను తీసుకొచ్చారు. అలాగే.. నరేందర్, అతని భార్య, అతని తల్లి బ్యాంక్ ఖాతాల్లో.. అక్షరాల కోటి 10 లక్షల రూపాయలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక.. బీరువాల్లో అర కిలో (51 తులాల) బంగారం, 2 కోట్ల విలువైన స్థిరాస్తులకు సంబంధించి 17 డాక్యుమెంట్లు బయటపడ్డాయి.

ఇదిలా ఉంటే.. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన బంధువులకు సంబంధించిన ఇళ్లలో దొరికిన సొత్తు వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తంగా.. నరేందర్‌ 50 కోట్లకు పైగానే ఆస్తులు కూడబెట్టాడంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. కాగా.. ప్రస్తుతం ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టినట్టు తేలటంతో.. కేసు నమోదు చేసిన అధికారులు.. నరేందర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

చిక్కిన మరో అవినీతి చేప..
మంచిర్యాల జిల్లా చెన్నూరు డివిజన్‌ ఇరిగేషన్‌ శాఖలో ఏఈగా పనిచేస్తున్న జాడి చేతన్‌ అనే ఉద్యోగి శుక్రవారం రోజు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. బాధితుడి నుంచి 5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. మిషన్‌ కాకతీయ ఫేజ్‌-4లో చేపట్టిన పనులకు ఎంబీ రికార్డు కోసం బొమ్మ చంద్రశేఖర్‌రెడ్డి అనే కాంట్రాక్టర్‌ ఏఈని సంప్రదించాడు. అందుకు ఏఈ లంచం డిమాండ్‌ చేయగా.. కాంట్రాక్టర్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

శుక్రవారం రోజున కార్యాలయంలో బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా.. అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం తీసుకున్న ఏఈపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టామని, కేసు దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10