AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈ నెల 2న అసెంబ్లీలో జాబ్ క్యాలెండ‌ర్ ప్రకటిస్తాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు జాబ్ క్యాలెండర్‌ను కేబినేట్ ఆమోదించింది అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ నెల 2వ తేదీన అసెంబ్లీ వేదిక‌గా జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్లు మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. అసెంబ్లీ క‌మిటీ హాల్‌లో మంత్రివ‌ర్గ స‌మావేశం ముగిసిన అనంత‌రం మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడారు.

కేరళలో వయనాడ్‌లో భారీ వర్షాలతో పాటు కొండచరియలు విరిగిపడి చాలా మంది చనిపోయారు. కేరళలో జరిగిన విషాదంపై తెలంగాణ కేబినేట్ సంతాప తీర్మానం ఆమోదించింది. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేసింది. ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయక చర్యలను అందించేందుకు ముందుకు వచ్చింద‌ని మంత్రి పేర్కొన్నారు. రేషన్ కార్డుల జారీతో పాటు రాష్ట్ర ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్‌తో హెల్త్ కార్డులను జారీ చేయాలని కేబినేట్ చర్చించింది. దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసేందుకు రెవెన్యూ శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, సివిల్ సప్లయిస్ మంత్రితో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. త్వ‌ర‌లోనే అర్హులైన పేద‌లంద‌రికి కొత్త రేష‌న్ కార్డులు జారీ చేస్తామ‌ని మంత్రి ప్ర‌క‌టించారు.

క్రీడాకారులు ఈషా సింగ్, నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్‌లో 600 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నిఖత్ జరీన్‌కు, సిరాజ్‌కు గ్రూప్ -1 స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇటీవల విధి నిర్వహణలో మరణించిన ఇంటెలిజెన్స్ డీజీ రాజీవ్ రతన్ కుమారుడు హరి రతన్‌కు మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం ఇవ్వాలని కేబినేట్ తీర్మానించింది. ఇటీవల విధి నిర్వహణలో చనిపోయిన అడిషనల్ డీజీ మురళి కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న‌ట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

గౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలో అసంపూర్తిగా నిలిచిపోయిన కుడి, ఎడమ కాల్వలు పూర్తి చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాదాపు రెండు వేల ఎకరాల భూసేకరణ చేపట్టేందుకు అవసరమయ్యే నిధులతో సవరణ అంచనాలను రూపొందించాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవల రాష్ట్ర గవర్నర్ ప్రభుత్వానికి తిరిగి పంపించిన ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి కేబినేట్ చర్చించింది. తిరిగి ఇద్దరి పేర్లను గవర్నర్ ఆమోదానికి పంపించాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు.

ANN TOP 10