AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఫోన్‌ ట్యాపింగ్‌తో నాకు సంబంధమే లేదు.. ప్రభాకర్‌రావు సంచలన లేఖ!

ఆరోగ్యం బాగాలేకే అమెరికాలో ఉన్నా..
నేను క్రమశిక్షణతో విధులు నిర్వహించా..
ప్రభాకర్‌రావు సంచలన లేఖ!
ఆసల్యంగా వెలుగులోకి..

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే పలు సంచలన విషయాలు బయటకువచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు రాసిన సంచలన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు వ్యవహారంలో ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభాకర్‌ రావు అమెరికా వెళ్లిపోయారు. అయితే ఈ కేసులో ఆయనను ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఈ నేపథ్యంలో ఆయన అమెరికా నుంచి పోలీసులకు రాసిన ఓ లేఖ ఆలస్యంగా బయటకు వచ్చింది. జూన 23న ప్రభాకర్‌ రావు జూబ్లీహిల్స్‌ పోలీసులకు లేఖ రాశారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుతో నాకు సంబంధం లేదని లేఖలో పేర్కొన్నారు. జూన్‌ 26న తాను ఇండియాకు తిరిగి రావాల్సి ఉండేదని.. అనుకోకుండా ఆరోగ్యం సహకరించక పోవడంతో అమెరికాలోనే ఉండాల్సి వచ్చిందని వివరించారు. కొంతకాలంగా క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. అమెరికాలోని వైద్యుల సూచన మేరకే చికిత్స తీసుకుంటున్నట్లు ప్రభాకర్‌ వెల్లడించారు.

దర్యాప్తుకు సహకరిస్తా..
‘ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో పోలీసులకు సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ప్రస్తుతం నేను అనారోగ్యంతో బాధపడుతున్నా. నాకు గతంలో ఉన్న మలిగ్నెంట్‌ క్యాన్సర్‌తోపాటు ఇప్పుడు బీపీ కూడా విపరీతంగా పెరిగింది. అందుకే రాలేకపోతున్నా. కావాలనే నాపై కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తూ మీడియాలకు లీకులు ఇస్తున్నారు. ఇప్పటికే నాతోపాటు నా కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ పోలీస్‌ అధికారిగా నేను ఎలాంటి తప్పు చేయలేదు. టెలీకాన్ఫరెన్స్‌ లేదా మెయిల్‌ ద్వారా ఎలాంటి సమాచారం ఇవ్వాలన్న నేను ఇస్తాను. నేను చాలా క్రమశిక్షణతో విధులు నిర్వహించా. నేనేం తప్పించుకుపోలేదు. ఎక్కడికీ పారిపోయే పరిస్థితి కూడా లేదు. పూర్తిగా కోలుకున్నాక మీ ముందు హాజరవుతా. అప్పుడే మీరు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాను. గతంలో కూడా పలుమార్లు ఉన్నతాధికారుకులకు ఇదే విషయాన్ని వాట్సాప్‌ ద్వారా చెప్పాను. నా దృష్టికి వచ్చిన ఈ సమాచారాన్ని విచారణ అధికారికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను.’ అంటూ లేఖలో పేర్కొన్నారు.

ANN TOP 10