మియాపూర్ భూముల ఆక్రమాణల కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత నెలలో సర్వే నెంబర్ 100, 101లలో వేలాదిమంది ఆక్రమణలకు యత్నించారు. పోలీసులు (Telangana Police) వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఖాకీలపైనే ఆక్రమణదారులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో భారీ బందోబస్తుతో ఆక్రమణదారులను కాప్స్ తరిమికొట్టారు. భూముల ఆక్రమణలకు, పోలీసులపై దాడికి కారకులైన వారిపై 83 మందిపై కేసులు నమోదు అయ్యాయి.
ఎఫ్ఐఆర్ నెంబర్ 862/2024గా నమోదు అవగా.. ఈ కేసులో ఇప్పటి వరకు 60 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 23 మంది పరారీలో ఉన్నారు. భూ ఆక్రమణ, పోలీసులపై రాళ్ల దాడిలో ముఖ్య పాత్ర పోషించిందంటూ ఈ కేసులో సంగీత అనే మహిళ ఏ1గా పేర్కొన్నారు. కబ్జాలకు కారణం, పోలీసులపై దాడికి యత్నం అంటూ ఐపీసీ 307కింద కేసులు నమోదు చేశారు. అయితే పోలీసులపై రాళ్లు వేసింది ఎవరనేది తేల్చడంలో ఖాకీలు విఫలమయ్యారు.
తాజాగా ఏ1 సంగీతకు రెండు రోజుల క్రితం బెయిల్ మంజూరు అవడం చర్చనీయాంశంగా మారింది. భూమి ఆక్రమణలతో పాటు పోలీసులపై దాడిలో ప్రధాన పాత్ర పోషించిన సంగీతకు ఇంత త్వరగా బెయిల్ రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ క్రమంలో హెచ్ఎండీఏ భూముల ఆక్రమణ, పోలీసుల మీద రాళ్ల దాడి కేసు నీరుగారినట్లేనా అనేది జనాల టాక్.









