ఈసారి లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ – ఎన్డీఏ కూటమిని గద్దె దించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ఇండియా కూటమి.. బీజేపీకి మెజార్టీ స్థానాలు రాకుండా అడ్డుకుంది. అయితే సొంతంగా బీజేపీని మేజిక్ ఫిగర్ దాటకుండా నిలువరించినా.. అధికారం చేపట్టకుండా మాత్రం ఆపలేకపోయారు. ఎన్డీఏ మిత్రులతో కలిసి కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ.. వేగంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తొలిసారి భేటీ అయిన ఇండియా కూటమి నేతలు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు.
కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం లేకపోవడంతో.. ఈసారి లోక్సభలో ప్రతిపక్ష పాత్ర పోషించాలని ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బుధవారం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వెల్లడించారు. ఢిల్లీలోని మల్లిఖార్జున ఖర్గే నివాసంలో భేటీ అయిన ఇండియా కూటమి నేతలు.. సుదీర్ఘ సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికల ఫలితాలు.. భవిష్యత్లో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఆ తర్వాత ఈసారి ప్రతిపక్షంలో కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఇండియా కూటమిలోకి ఇతర పార్టీలను కూడా ఆహ్వానిస్తున్నట్లు మల్లిఖార్జున ఖర్గే ఆహ్వానించారు.
ఇక బీజేపీ, నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలన్నీ ఏకతాటిపై పోరాటం చేస్తాయని ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మేజిక్ ఫిగర్ను దాటకపోవడంతో నరేంద్ర మోదీ నైతికంగా ఓటమి చెందారని ఖర్గే అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన నైతికంగా ఓడిపోయారని విమర్శించారు. అంతేకాకుండా వ్యక్తిగతంగా, రాజకీయంగానూ మోదీ నష్టపోయారని పేర్కొన్నారు.









