AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వాహనదారులూ అలర్ట్‌… టోల్‌ ఛార్జీలు పెంపు.. ఎప్పటి నుంచి అంటే..

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణం చేసే వాహనదారులకు బ్యాడ్‌న్యూస్. టోల్‌ ప్లాజాల్లో ఛార్జీలు పెరగనున్నాయి. జూన్ 2 నుంచి పెంపు అమల్లోకి రానుందని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) వెల్లడించింది. ప్రతి ఏటా ఏప్రిల్‌ 1న రుసుములు పెరుగుతాయి. రోడ్ల నిర్వహణకు ఈ ఛార్జీలను పెంచుతారు. అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పెంపు వాయిదా పడింది. టోల్‌ఛార్జీల పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఎన్‌హెచ్‌ఏఐను ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. చివరి విడత జూన్‌ 1న ఎన్నికలు ముగియనున్నాయి. ఆ రోజు అర్ధరాత్రి నుంచి టోల్‌ ధరలు పెరుగుతాయి. ఇప్పటికే ఈ మేరకు టోల్‌ప్లాజాల నిర్వాహకులకు NHAI ఉత్తర్వులను జారీ చేసింది. టోల్‌ రుసుముల పెంపు సగటున 5 శాతం వరకు ఉంటుంది.

హైదరాబాద్‌-విజయవాడ (65) నేషనల్ హైవేను ఉదాహరణగా తీసుకుంటే.. ఈ హైవేపై తెలంగాణలోని చౌటుప్పల్‌ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌, ఆంధ్రప్రదేశ్‌లోని చిల్లకల్లు వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. కార్లు, వ్యాన్‌లకు ఒక వైపు ప్రయాణానికి రూ.5, రానూపోనూ కలిపి రూ.10, తేలికపాటి గూడ్స్ వెహికల్స్ ఒక వైపు రూ.10, ఇరు వైపులా అయితే రూ.20, అదే విధంగా బస్సు, ట్రక్కులకు రూ.25, రూ.35, భారీ రవాణా వాహనాల అయితే రూ.35, రూ.50 చొప్సున పెంచారు. 24 గంటల లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు ఛార్జీలో 25 శాతం మినహాయింపు ఉంటుంది. ఇక స్థానికుల నెలవారీ పాస్‌ను కూడా పెంచారు. ఆ పాసులను రూ.330 నుంచి 340కి పెంచారు. పెంచిన ధరలు 2025 మార్చి 31 వరకు అమలులో ఉండనున్నాయి.

ANN TOP 10