ఇరాన్ దేశంలో విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆ దేశాధ్యక్షుడు (Iran President) ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అయితే అధ్యక్షుడి మరణ వార్త తెలుసుకున్న ఇరాన్ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి (fireworks), మందు పార్టీతో రైసీ మృతిని సెలబ్రేట్ చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఇబ్రహీం రైసీ మృతి వార్త తెలియగానే ఇరాన్లో వందలాది మంది ప్రజలు టెహ్రాన్, మషాద్లోని ప్రధాన కూడళ్లలో గుమిగూడి సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చారు. ఇక విదేశాల్లో ఉన్న ఇరానీయులు కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. లండన్లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రాయబార కార్యాలయం ముందు కొందరు ఇరానీయులు వచ్చి సంబరాలు జరుపుకున్నారు. కొందరు స్వీట్లు పంచారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా, రైసీ ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత చాలా క్రూరంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. ఇస్లామిక్ అచారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెబుతున్నారు. ఇరాక్-ఇరాన్ యుద్ధ సమయంలో చిక్కిన ఖైదీలను రైసీ దారుణంగా ఉరి వేయించాడని, ఆయన నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వారిని కూడా రైసీ కఠినంగా శిక్షించినట్ల ఆరోపణలు ఉన్నాయి. రైసీ పట్ల ఇరాన్ ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు స్థానిక మీడియాలో వరుస కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన మృతిని ఇరాన్ ప్రజలు ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.









