న్యూఢిల్లీ: ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో సోమవారంనాడు జరిగిన లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) ఐదో విడత (Fith Phase) పోలింగ్ ముగిసింది. మొత్తంగా 56.7 శాతం పోలింగ్ నమోదైంది. ఈసీ వివరాల ప్రకారం, పశ్చిమబెంగాల్లో గరిష్టంగా 73 శాతం పోలింగ్ నమోదైంది.
లఢక్లో 67.15, ర్ఖాండ్లో 61.90, ఒడిశాలో 60.55, ఉత్తరప్రదేశ్లో 55.80, జమ్మూకశ్మీర్లో 54.2, బీహార్లో 52.35 శాతం పోలింగ్ నమోదు కాగా, మహారాష్ట్రలో అత్యల్పంగా 48.66 శాతం పోలింగ్ జరిగింది. ఈసారి ఎన్నికల బరిలో ఉన్న ప్రముఖులలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్ (ముంబై నార్త్), భారతి పవార్ (దిండోరి), స్మృతి ఇరానీ (అమేథీ), రాజ్నాథ్ సింగ్ (లక్నో), ఎల్జేపీ-రామ్విలాస్ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ (హిజాపూర్), మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తనయుడు శ్రీకాంత్ షిండే (కల్యాణ్) ఉన్నారు. రాయబరేలి నుంచి రాహుల్ గాంధీ, శరణ్ నియోజవర్గం నుంచి ఆర్జేడీ చీఫ్ లాలూ కుమార్తె రోహిణి ఆచార్య, ముంబై సౌత్ నుంచి శివసేన-యూబీటీ అభ్యర్థిగా అరవింద్ సావంత్ పోటీ చేస్తున్నారు. జమ్మూకశ్మీర్లోని బారాముల్లా నుంచి మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఒమర్ అబ్దుల్లా పోటీలో ఉన్నారు.
కాగా, లోక్సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ 58 నియోజకవర్గాల్లో మే 25న జరుగనుంది. దేశరాజధాని ఢిల్లీ, హర్యానాల్లో ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.









