మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటన విచారణను బెజవాడ పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే ఆరు టీంలను ఏర్పాటు చేసి వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. తాజాగా మరో 16 టీంలను ఏర్పాటు చేసిన పోలీసులు కేసుకు సంబంధించి వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిపై దాడి చేసిన వారి నిందితుల వివరాలు తెలిపితే రెండు లక్షల రూపాయల నగదు బహుమతిని ఇస్తామని పోలీసులు ప్రకటించారు. ఎవరు చెప్పినా వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, తమకు సమాచారం ఎవరికైనా తెలిస్తే పోలీసులకు దానిని అందచేయాలని విజయవాడ పోలీసులు కోరారు.
దీంతో జగన్ పై దాడి ఘటనపై పోలీసులు సీరియస్ గా తీసుకుని విచారణ చేపట్టినట్లు అర్థమవుతుంది. నిందితులు ఎవరైనా తమకు సమాచారం తెలిస్తే పోలీసు అధికారులకు సంబంధించిన ఫోన్ నెంబర్లకు తెలియజేయాలని కోరారు. ఈ ప్రకటనతో నైనా నిందితుడు ఎవరో దొరుకుతాడని పోలీసులు భావిస్తున్నారు. జగన్ పై దాడి జరిగిన సమయంలో అక్కడ విద్యుత్తు లేకపోవడం, సీసీ టీవీ వైర్లు కూడా కట్ కావడంతో ఈ విధమైన బహుమతిని పోలీసులు ప్రకటించారు. ఇప్పటికే దీనిపై సిట్ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.









