(అమ్మన్యూస్, హైదరాబాద్):
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు కితాబునిచ్చారు. ఆయన బాగా పని చేస్తున్నారని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తాను సీఎంకు మద్దతుగా ఉండటం కొందరికి నచ్చడం లేదన్నారు. కానీ ఆయన బాగా పని చేస్తున్నాడు కాబట్టే మద్దతును ఇస్తున్నానని తెలిపారు. తనకు పార్టీ అధిష్టానం ఖమ్మం లోక్ సభ టిక్కెట్ ఇస్తే చాలా సంతోషిస్తానని చెప్పారు.
తనది కాంగ్రెస్ పార్టీ రక్తమని, ఖమ్మం ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ అధిష్ఠానాన్ని అడిగినట్లు చెప్పారు. తనకు టికెట్ ఇవ్వకపోయినా తాను తిరుగుబాటు చేయబోనన్నారు. 2019లో ఖమ్మం నుంచి పోటీకి ప్రయత్నించినట్లు చెప్పారు. ఖమ్మం నుంచి పోటీ చేయడం కోసం అక్కడ గ్రౌండ్ వర్క్ కూడా చేసినట్లు చెప్పారు. తనకు ఖమ్మం టిక్కెట్ ఇస్తే గెలిచినట్లేనని ధీమా వ్యక్తం చేశారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తనను ఖమ్మంలో పోటీ చేయాలని మొదట చెప్పి… ఇప్పుడు తన భార్యకు టిక్కెట్ కావాలని అడుగుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అధిష్ఠానం ఎవరికి టిక్కెట్ ఇస్తే వారికి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.









