బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలిచినా దేనికైనా సిద్ధం
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
(అమ్మన్యూస్, నల్లగొండ):
వచ్చే పదేళ్లూ సీఎంగా రేవంత్రెడ్డే కొనసాగుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద సీనియర్ నేత జానారెడ్డితో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ కుల, మతాల మధ్య ఘర్షణ పెట్టి లబ్దిపొందాలని చూస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. దేశ ఐక్యతకు జరగబోయే ఎన్నికలు నిదర్శనమన్నారు. రేవంత్ రెడ్డి పదేళ్లు సీఎంగా ఉంటారని.. కాంగ్రెస్ 10 ఏళ్ళు అధికారంలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్లో ఏకనాథ్ షిండేలు లేరని.. హస్తం పార్టీలో గ్రూపులు లేవన్నారు. అందరం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నామన్నారు.
ఏకనాథ్ షిండేను సృష్టించిందే బీజేపీ పార్టీ అని ఆయన విమర్శలు గుప్పించారు. హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డిలు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని హెచ్చరించారు. పనికిరాని చిట్ చాట్లు బంద్ చేయాలన్నారు. బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలుచుకుంటే తాను దేనికైనా సిద్ధమని మంత్రి కోమటిరెడ్డి సవాల్ విసిరారు. తమ పార్టీ అంతర్గత విషయాలు మహేశ్వర్ రెడ్డి మాట్లాడొద్దన్నారు.









