మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రంజాన్ను పురస్కరించుకుని చార్మినార్ మక్కా మసీదు వద్ద ముస్లిం సోదరులు ప్రార్ధనల్లో పాల్గొన్నారు. పండుగ నేపథ్యంలో ఎలాంటి ఆటంకాలు జరుగకుండా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. చార్మినార్ వద్ద 200 మంది లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్ పోలీసులు భద్రతా విధుల్లో ఉన్నారు. చార్మినార్ పరిసరాలో ట్రాఫిక్ ఆంక్షలు, పలు ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు.
సామూహిక ప్రార్థనలు..
అటు మిరాలం ఈద్గాలో సామూహిక ప్రార్థనలు మొదలయ్యాయి. పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. అంతకు ముందు ఉదయం హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి మిరాలం ఈద్గా కు చేరుకుని.. అక్కడి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. 10:30 గంటలకు ప్రార్థనలు ముగియనున్నాయి. బాంబ్ అండ్ డాగ్ స్క్వాడ్తో ముమ్మర తనిఖీలు నిర్వహించారు.
ట్రాఫిక్ ఆంక్షలు…
మరోవైపు హైదరాబాద్లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముస్లిం సోదరుల ప్రార్థనల నేపథ్యంలో మీరాలంమండి ఈద్గా, మాసబ్ట్యాంక్ హాకీ గ్రౌండ్ పరిసరాల్లో ఉదయం 8 గంటల నుంచి 11:30 ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. పురానాపూల్, కామాటిపురా, కిషన్బాగ్ వైపు నుంచి ఈద్గా వైపునకు వచ్చే వాహనాలను బహదూర్పురా క్రాస్రోడ్స్ వరకే అనుమతి ఇచ్చారు. ప్రార్థనలకు వచ్చే వారి వాహనాలను జూపార్క్ ఓపెన్ ప్లేస్లో పార్కింగ్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. శివరాంపల్లి, దానమ్మహట్స్ వైపునకు వచ్చే వాహనాలను దానమ్మహట్స్ క్రాస్రోడ్స్ వైపు వరకే వాహనాలకు అనుమతి ఇచ్చారు. వీరికి మోడరన్ సా మిల్, మీరాలం ఫిల్టర్ బెడ్, సూఫీ కార్స్ వద్ద పార్కింగ్ స్థలం కేటాయించారు.









