రాజన్న సిరిసిల్లలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం వచ్చే పరిస్థితి ఉందన్నారు కేసీఆర్. గోదావరి నది మీద నిర్మించిన ప్రాజెక్టులు సజీవ జల ధారలు.. అలాంటిది నాలుగైదు నెలల్లోనే కరీంనగర్ ఎడారి అయ్యింది అని కేసీఆర్ అన్నారు. మిడ్ మానేరు బ్రిడ్జి సముద్రంలా ఉండేది, ఇప్పుడు ఎండిపోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వ తెలివి తక్కువతనం వల్లే ఇలా జరిగిందన్నారు. 2014 కన్నా ముందు ఉన్న తెలంగాణ.. ఇప్పుడు మళ్లీ కనిపిస్తోందన్నారు.
”పంటలు ఎండని జిల్లా లేదు. ఇందిరమ్మ రాజ్యంలో ఇగిలించిన తెలంగాణ అయ్యింది. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువే. కిరికిరి మాటలు చెప్పి తప్పించుకోవద్దు. 15లక్షల ఎకరాలు ఎండిపోయాయి. రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం వచ్చే పరిస్థితి ఉంది. జొన్న పంటను పూర్తిగా కొనుగోలు చేయాలి. రైతులకు బోనస్ ఇవ్వాలి. దీనికి ఎలక్షన్ కోడ్ అడ్డం కాదు” అని కేసీఆర్ అన్నారు. సిరిసిల్ల జిల్లాలో పొలం బాటలో భాగంగా ఎండిపోయిన పంటలను పరిశీలించారు కేసీఆర్. పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. కరీంనగర్ జిల్లా ముగ్ధంపూర్ లోనూ కేసీఆర్ పర్యటించారు. శభాష్ పల్లి దగ్గర మిడ్ మానేరు జలాశయాన్ని సందర్శించారు.









