రాష్ట్రంలో రెండు మూడు రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్న ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని ఆయన (ఎక్స్) ట్విట్టర్ వేదికగా ఆయన డిమాండ్ చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి తదితర జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన అన్నదాతను అతలాకుతలం చేసిందన్నారు. పంటలు చేతికి రానున్న సమయంలో కురిసిన వడగండ్ల వాన రైతులకు కన్నీరు మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వరి, మొక్కజొన్న, జొన్న పంటలతోపాటు బొప్పాయి, మామిడి సహా ఇతర ఉద్యాన పంటలు దెబ్బతినడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. గతంలో అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతే అప్పటి సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లి రైతులను పరామర్శించి భరోసా కల్పించారని తెలిపారు. అక్కడికక్కడే ఎకరాకు రూ. 10 వేల నష్టపరిహారం ప్రకటించి అమలు చేశారని చెప్పారు. ఇప్పటి ప్రభుత్వం రాజకీయాలు తప్ప రైతు ప్రయోజనాలు పట్టవా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా మేల్కొని అన్నదాతకు అండగా నిలవాలని ప్రభుత్వాన్ని కోరారు. జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయడంతో పాటు ఎకరాకు రూ. 10 వేలు చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.