వాల్మార్ట్ నేతృత్వంలోని ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ యూపీఐ సేవలను ప్రారంభించింది. యాక్సిస్ బ్యాంక్తో కలిసి ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆదివారం ప్రకటించింది. యాప్ ద్వారా ఆన్లైన్, ఆఫ్లైన్ చెల్లింపులు చేయొచ్చని పేర్కొంది. ఇకపై ఫ్లిప్కార్ట్లో వస్తువుల్ని కొనుగోలు చేసే వారు చెల్లింపుల కోసం గూగుల్ పే, ఫోన్ పే లాంటి థర్డ్ పార్టీ యాప్స్పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
‘‘డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ వేగంగా మారుతున్న నేపథ్యంలో.. కస్టమర్లకు నిరంతర యూపీఐ సేవలను అందించడానికి ఫ్లిప్కార్ట్ యూపీఐ సేవలు తీసుకొచ్చాం’’ అని ఫిన్టెక్ అండ్ పేమెంట్స్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధీరజ్ అనెజా తెలిపారు. ఫ్లిప్కార్ట్ యాప్లో యూపీఐ ఐడీని క్రియేట్ చేసుకొని చెల్లింపులు జరపొచ్చన్నారు. 50 కోట్ల మందికి పైగా కస్టమర్లు, 14 లక్షల మంది విక్రేతలు ఇకపై ఫ్లిప్కార్ట్ ద్వారా యూపీఐ సేవలు పొందొచ్చని వెల్లడించారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఈ సేవల్ని పరిచయం చేసినట్లు సంస్థ తెలిపింది. ఇటీవల ఫుడ్ డెలివరీ సర్వీస్ జొమాటో కూడా ఈ సేవల్ని ప్రారంభించింది. అమెజాన్, టాటా న్యూ చాలా కాలం నుంచి వీటిని అందిస్తున్న విషయం తెలిసిందే.









