AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జాతీయ రాజకీయాలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కాలక్రమంగా తగ్గుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ఆదివారం ఎంసీహెచ్ఆర్డీలో ‘గవర్నర్​పేట్- గవర్నర్స్​ హౌజ్​’​ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ మాట్లాడుతూ… ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవ్వడం మంచి అవకాశంగా భావిస్తున్నానని తెలిపారు. 76 సంవత్సరాల్లో అన్నింటిపై అవగాహన పొందిన పెద్దలందరిని ఇక్కడ కలుసుకోవడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని అన్నారు. గతంలో సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారని వివరించారు. వారి తర్వాత జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు ఆ స్థాయిని కొంతవరకు నిలబెట్టారని చెప్పారు. కానీ ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కనిపించడం లేదన్నారు. ఇది మన మనుగడ, గుర్తింపునకు మంచి పరిణామం కాదని అన్నారు. తెలుగు వాళ్లందరూ కలిసి ప్రయాణం మొదలు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

కేంద్ర కేబినెట్‌లో తెలుగు వాళ్లు తక్కువ…
జాతీయ స్థాయిలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు అని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో కూడా ఆ స్థాయిలో తెలుగు వారు ఉండాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. కేంద్ర కేబినెట్‌లో తెలుగు వాళ్లను వెతికి చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. అనుభవజ్ఞుల నుంచి తమ ప్రభుత్వం సూచనలు తీసుకుంటుందని తెలిపారు. గతంలో నంద్యాలలో పీవీ నరసింహరావు పోటీ చేసినప్పుడు.. తెలుగువారు ప్రధానిగా ఉండాలని ఎన్టీఆర్ భావించారని. అందుకనే పీవీపై టీడీపీ అభ్యర్థిని పోటీకి పెట్టకుండా ఏకగ్రీవం చేసే ప్రయత్నం చేశారని గుర్తుచేశారు. రాజకీయాల్లో అప్పుడప్పుడు ఒక మంచి సంప్రదాయాన్ని పాటించడంలో తప్పులేదని అన్నారు. తమ ప్రభుత్వం కూడా అలాంటి మంచి సంప్రదాయాన్ని పాటిస్తుందని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినా అంతా ఏకతాటిపై ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ANN TOP 10