హైదరాబాద్ లోని ప్రజాభవన్ వద్ద బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 23వ తేదీన అర్ధరాత్రి 2:45 గంటల సమయంలో కారును అతివేగంగా డ్రైవ్ చేస్తూ తెలంగాణ ప్రజాభవన్ వద్ద ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ సమయంలో స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే సోహెల్ అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిసింది. ఈ సమయంలో కేసు తప్పుదోవ పట్టించడానికి వేరే వ్యక్తి కారు డ్రైవ్ చేసినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు కథనాలొచ్చాయి.
ఈ సమయంలో తాజాగా ప్రజాభవన్ ముందు జరిగిన ఆ రోడ్డు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును పంజాగుట్ట పోలీసులు ఎఫ్.ఐ.ఆర్.లో చేర్చారు. సోహైల్ దుబాయ్ కు పారిపోయేందుకు సహకరించినట్లు గుర్తించిన పోలీసులు… అందుకు కనీసం పది ముంది సహాయం చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో సోహైల్ కు సహాయం చేశారనే అభియోగాలపై ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయగా.. మరో ముగ్గురు పారిపోయినట్లు గుర్తించారని తెలుస్తుంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో సోహైల్ పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… సోహైల్ ను దుబాయ్ నుంచి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. కాగా… ప్రజా భవన్ ముందు బీఆరెస్స్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహెల్ గత నెల 23వ తేదీన కారుతో బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ తో ప్రజాభవన్ ఎదుట బారీకేడ్లను కారుతో ఢీకొట్టాడు. ఘటన సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు!









