స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో జీహెచ్ఎంసీ జాతీయ అవార్డును అందుకోనుంది. పారిశుధ్య నిర్వహణలో ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించినట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ రోనాల్డ్రోస్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర గృహ పట్టణాభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి ఆహ్వానం అందింది. ఈ నెల 11న న్యూఢిల్లీలో జరిగే అవార్డుల ప్రదాన కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రిత్వ శాఖ ఆహ్వానం పంపింది.
స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో పారిశుధ్య నిర్వహణ విభాగంలో లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలను (నేషనల్ ర్యాంకింగ్), లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న నగరాలను (స్టేట్ అండ్ జోనల్ ర్యాంకింగ్)లో ఎంపిక చేస్తారు. ఈ మేరకు 2023 డిసెంబర్ 23 నుంచి పది రోజులపాటు స్వచ్ఛ సరేక్షణ్ బృందాలు ప్రజల నుంచి అభిప్రాయాన్ని సేకరించాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీని జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక చేసినట్లు మేయర్, కమిషనర్ తెలిపారు. ఇప్పటి వరకు త్రీస్టార్ ర్యాంకింగ్ ఉండగా, తాజా అవార్డుతో నగరానికి ఫైవ్ స్టార్ ర్యాంకింగ్ రానుందని తెలిపారు.