తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు ప్రత్యేకత ఉంది. ఏ పండుగకు వెళ్లని వారు తమ సొంత ఊళ్లకు వెళ్లి రెండు రోజులు కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు ఆసక్తిచూపుతారు. సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ బస్సులను జనవరి 6 నుండి 15 వరకు హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు.
అలాగే ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకుల కోసం పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు కూడా అధిక సంఖ్యలో సర్వీసులు నడపాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. సంక్రాంతికి ప్రతి ఒక్కరినీ సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఛార్జీల్లో ఎలాంటి పెరుగుదల లేకుండా సాధారణ ఛార్జీలతో ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని చెప్పారు.
ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బి నగర్, ఆరామ్ఘర్, కెపిహెచ్బి లలోప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. అలాంటి బస్ స్టాపుల్లో బస్సులు ఎక్కేందుకు వేచి ఉన్న ప్రయాణికుల కోసం టిఎస్ఆర్టిసి అధికారులు ప్రత్యేక శిబిరాలను కూడా ఏర్పాటు చేశారని వివరించారు. తాగునీరు, మొబైల్ బయో-టాయిలెట్లు అవసరమైన ప్రదేశాలలో ప్రయాణీకుల సౌకర్యం ఏర్పాటు చేశామని వాటిని వినియోగించుకోవాలని కోరారు.









