రాష్ట్ర మంత్రి కేటీఆర్పై దుబ్బాక బీజేపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సంస్కారహీనంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమురా కేటీఆర్..’ అంటూ మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తగినవిధంగా బుద్ది చెబుతామని హెచ్చరించారు. మెదక్ జిల్లా చేగుంటలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రి హోదాలో ఉండి సభ్యత సంస్కారం లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ఉన్న తనపై సంస్కారం లేకుండా మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కడున్నాడని ప్రశ్నించారు. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్టు.. తండ్రి పేరు చెప్పుకొని కేటీఆర్ గెలిచారంటూ విమర్శించారు. దౌల్తాబాద్లో జరిగిన బీఆర్ఎస్ రోడ్ షోలో కేటీఆర్ తనపై పరుషంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ కంటే దారుణంగా మాట్లాడే సత్తా తమకుందని పేర్కొన్నారు.
తల్లిదండ్రులు తనకు సంస్కారం నేర్చారని, కేటీఆర్ తనపై మాట్లాడినందుకు తాను కూడా మాట్లాడాల్సి వచ్చిందని రఘునందన్రావు స్పష్టం చేశారు. 2001 నుంచి 2007 వరకు ఉద్యమ సమయంలో తెలంగాణలోలేని కేటీఆర్.. తొలి నుంచి ఉద్యమంలో ఉండి ప్రజల కోసం పోరాటి చేసినవారిపై అవాకులు, చవాకులు పేలితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణ మలి దశ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ ఇప్పుడు ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. కుసంస్కారంతో నీవు నీచమైన భాష మాట్లాడడం దుబ్బాక ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటమేనని తేల్చిచెప్పారు.









