ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచ కప్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఆదివారం (నవంబర్ 19) భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ పోరు జరగనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. 2003 ప్రపంచకప్లో ఆస్ట్రేలియాపై చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం టీమిండియాకు దొరికింది.
అలాగే 2015 ప్రపంచ కప్ సెమీస్లోనూ ఆసీస్ చేతిలో భారత్కు చుక్కెదురైన సంగతి తెలిసిందే. కాగా వన్డే వరల్డ్ కప్ ప్రైజ్మనీ వివరాలను గతంలోనే ప్రకటించింది ఐసీసీ. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రపంచ కప్ కు భారీ ప్రైజ్మనీని ప్రకటించారు. విజేతతో పాటు టోర్నీలో ఆడిన ఆన్ని జట్లకు భారీగా ప్రైజ్ మనీ అందనుంది. టోర్నీ మొత్తానికి రికార్డు స్థాయిలో 10 మిలియన్ అమెరికన్ డాలర్లు కేటాయించారు. అంటే భారతీయ కరెన్సీలో సుమారు 83 కోట్లు. దీనిని ప్రపంచకప్ టైటిల్ విజేత, రన్నరప్, సెమీ ఫైనలిస్టులు, గ్రూప్ స్టేజ్లో ఓడిపోయిన జట్లకు పంచుతారు.
ప్రపంచ కప్ విజేతకు రూ.33 కోట్లు అందజేయనున్నారు. ఇక రన్నరప్గా నిలిచిన జట్టుకు దాదాపు 16.64 కోట్ల రూపాయల నగదు బహుమతిని ప్రదానం చేస్తారు. సెమీఫైనల్లో ఓడిన రెండు జట్లకు ఒక్కొక్కరికి రూ.6.65 కోట్లు లభిస్తాయి. గ్రూప్ స్టేజ్ మ్యాచ్ల్లో ఓడిన మిగతా ఆరు జట్లకు ఒక్కొక్కరికి రూ.83 లక్షలు బహుమతిగా అందజేస్తారు. ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ ఈ మొత్తం రూ.5 కోట్లు అందుకోనున్నాయి.









