ధరణి స్థానంలో భూ భారతి?
కొత్త హామీలపై సర్వత్రా ఆసక్తి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రచారాన్ని ముమ్మురం చేసింది. ప్రత్యర్థులే టార్గెట్గా ప్రచారంలో దూసుకుపోతోంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ను గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ఇప్పటికే ఆరు గ్యారంటీలు అంటూ హామీలు ఇచ్చింది. మీ ఓటుతో అధికారం ఇస్తే అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం అంటూ కాంగ్రెస్ ప్రచారాన్ని ముమ్మురం చేసింది. ఈక్రమంలో శుక్రవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనుంది. దీంట్లో ఎటువంటి హామీలు ఇవ్వనుందో అనేది ఆసక్తికరంగా మారింది. ధరణి స్థానంలో భూ భారతి తీసుకువస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
తెలంగాణలో అన్ని పార్టీలు ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఓట్ల యుద్ధానికి సిద్ధమైన క్రమంలో బీఆర్ఎస్ ఇప్పటికే తమ మేనిఫెస్టోను ప్రకటించింది. ఇక ఫుల్ మేనిఫెస్టోను కాంగ్రెస్ ప్రకటించేందుకు సిద్ధమైంది.
రేపు రాహుల్ గాంధీ, ఖర్గే రాక
రాహుల్ గాంధీ, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. రాహుల్ పినపాక, పరకాల, వరంగల్ ఈస్ట్,రాజేంద్రనగర్ లలో పర్యటించి ప్రచారం చేయనున్నారు. మల్లికార్జున ఖర్గే రేపు తాజ్ కృష్ణాలో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. అనంతరం కుత్బుల్లాపూర్లో పర్యటించి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ విడుదల చేయబోయే మ్యానిఫెస్టోపై ఉత్కంఠ నెలకొంది.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో కొన్ని అంశాలు..
– ధరణి స్థానంలో భూ భారతి పేరుతో అప్ గ్రేడ్ యాప్..
– అభయహస్తం పథకం తిరిగి పునరుద్ధరణ
– అమ్మ హస్తం పేరుతో తొమ్మిది నిత్యావసర వస్తువులు పంపిణీ
– రేషన్ డీలర్లకు గౌరవ వేతనంతో పాటు కమీషన్
– గ్రామ వార్డు సభ్యులకు గౌవర వేతనం
– ఆర్ఎంపీ, పీఎంపీలకు గుర్తింపు కార్డులు
– ఎంబీసీలకు ప్రత్యేక కార్పొరేషన్









