తెలంగాణలో అధికారమే ధ్యేయంగా గత కొంత కాలంగా వ్యూహాత్మకంగా వెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి అన్నీ కలిసి వస్తున్నాయి. నేతల్లో ఐక్యతారాగంతో శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. అదే విధంగా గత కొన్నాళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న ప్రజావ్యతిరేకతను ఓట్లుగా మలచుకోవడంలో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో సఫలమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కొన్ని చోట్ల రెబల్స్ బెడద తలనొప్పిగా మారింది. దీంతో రంగంలోకి దిగిన అధిష్టానం దూతలు రెబల్స్ లలో చాలా మందిని మెప్పించి ఒప్పించి తమ దారికి తీసుకు రావడంతో కాంగ్రెస్ కు రాష్ట్రంలో ఎదురే లేదన్న విషయాన్ని పరోక్షంగా ప్రజలకు తెలిపినట్లైంది.
తెలంగాణలో నేటితో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులను బుజ్జగించడంలో ఆ పార్టీ అధిష్టానం సక్సెస్ అయ్యింది. ఎట్టకేలకు రెబల్ నేతలను హస్తం పార్టీ దారిలోకి తెచ్చుకుంది. బరిలో నుంచి తప్పుకున్న నేతలకు డీసీసీ అధ్యక్ష పదవుల హామీ లభించింది. అలాగే మరి కొంతమందికి పార్లమెంట్ సీటు హామీ లభించింది.మరి కొంత మందికి ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్ పదవుల హామీ లభించడంతో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు. పోటీ నుంచి కాంగ్రెస్ రెబల్ అభ్యర్ధులు తప్పుకోవడంతో హస్తం పార్టీకి భారీ ఉపశమనం లభించినట్లైంది.
వెనక్కి తగ్గిన నేతలు వీరే….
సూర్యాపేట – పటేల్ రమేష్ రెడ్డి
జుక్కల్ – గంగారం
బాన్సువాడ – బాలరాజు
డోర్నకల్ – నెహ్రూ నాయక్
వరంగల్ వెస్ట్ – జంగా రాఘవ రెడ్డి
ఇబ్రహీంపట్నం – దండెం రాంరెడ్డి









