జమ్మూ కశ్మీర్లో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తోన్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 36 మంది మృతి చెందగా.. మరో ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. దోడా జిల్లాలోని బటోటే-కిష్టావర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు జమ్మూ డివిజనరల్ కమిషన్ రమేశ్ కుమార్ తెలిపారు. రహదారి పక్కన 300 అడుగుల లోతైన లోయలో బస్సు పడిపోయినట్టు ఆయన చెప్పారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే.. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని అన్నారు. గాయపడినవారిని కిష్టావర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు వెల్లడించారు.
రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని, లోయలో నుంచి మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని కమిషనర్ పేర్కొన్నారు. క్షతగాత్రులను తరలించేందుకు హెలికాప్టర్ సేవలను కూడా ఏర్పాటుచేసినట్టు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. ‘క్షతగాత్రులను కిష్టావర్ జిల్లా ఆస్పత్రి, దోడాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలిస్తున్నాం.. తీవ్రంగా గాయపడిన బాధితుల తరలింపు కోసం హెలికాప్టర్ ఏర్పాటుచేశాం.. అవసరమైన మేరకు అన్ని విధాలుగా సహాయక చర్యలను కల్పిస్తున్నాం’ అని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు.
ఈ ప్రమాదంపై జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆమె సంతాపం తెలియజేశారు. ‘దోడాలోని అసార్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. అధికార యంత్రాంగం సహాయక చర్యలను వేగవంతం చేస్తుందని ఆశిస్తున్నాను’ అని ముఫ్తీ ట్వీట్ చేశారు.









