ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 10కి 10 స్థానాలు గెలుస్తుందని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అన్నారు. మంగళవారం నాడు గాంధీభవన్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న కాంగ్రెస్ సునామిలో కేసీఆర్ పార్టీ కొట్టుకుపోవడం ఖాయం. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఓటమి భయంతో మా కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. మా ఖమ్మం కార్పొరేటర్ రాఫీనా బేగం పైన బైండోవర్ కేసులు వేశారు. మజ్లిస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి ఇబ్బందులు పెడుతున్నారు. చట్టానికి విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఖబర్థార్. నువ్వు ఓడిపోయిన తక్షణం అక్కడి నుంచి పారిపోతావ్. కాంగ్రెస్ పార్టీలో గెలిచి పార్టీ మారిన పువ్వాడ అజయ్ లాంటి వారిని దగ్గరకు తీసుకోవడం వల్లే కేసీఆర్ ఈ ఎన్నికల్లో ఓడిపోబోతున్నాడు.
పువ్వాడ అజయ్ పాముకు పాలు పోస్తే కాటు వేసే రకం. పువ్వాడ అజయ్ కాంగ్రెస్ కార్యకర్తలను ఎంత ఇబ్బంది పెడితే అంత బలంగా ముందుకు వస్తారు. బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ఒకటే. ఈ పార్టీలు మతతత్వ రాజకీయాలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రచారం చేస్తా.కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దాడులు చేస్తున్నాయి. మీరు దాడులు చేస్తారని మేము పైసలు ఇంట్లో పెట్టుకొని కూర్చుంటామా. బీఆర్ఎస్లో ఎంతమంది కోవర్ట్లు ఉన్నారో మాకు తెలుసు. మాకు కోవర్ట్లు ఉన్నారు. వారికి కూడా కోవర్ట్లు ఉన్నారు’’ అని రేణుకా చౌదరి అన్నారు.









