కరీంనగర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్ పై బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగున్నర సంవత్సరాలు కనపడని ఎంపీ బండి సంజయ్ ఇప్పుడొచ్చి ఓట్లేయాలని అనడం విడ్డూరంగా ఉందన్నారు. మోదీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి నిధులు తీసుకువచ్చావా సంజయ్ అంటూ ప్రశ్నించారు. ప్రజల్లోకి వెళ్లి గెలిచి సత్తా చాటుకోవాలని సంజయ్ కు గంగుల సూచించారు. ఈ ఎన్నికల్లో నీది మూడో ప్లేస్, ప్రజలను రెచ్చగొడితే ఓట్లు వేసే స్థితిలోలేరని గుర్తుంచుకోవాలని అన్నారు. బండి సంజయ్ నోరు తెరిస్తే అబద్దాలతో రాజకీయం చేస్తున్నాడని గంగుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులు పిలిస్తే రైల్వే ఓవర్ బ్రిడ్జికి మేము పోయాము.. కానీ సంజయ్ రావాలి కదా. సెల్ ఫోన్లు పంచుతున్నారనేది అబద్ధం. రేషన్ కార్డు పై అవగాహన లేని వ్యక్తితో సవాల్ అవసరం లేదని గంగుల అన్నారు. నీ రాజకీయ భవిష్యత్ ఏంటో తెలుసుకోవాలి. గంజాయి మత్తు అని ఆరోపణలు చేస్తే ప్రజలు చులకనగా నవ్వుతున్నారు. డిసెంబర్ 3 తరువాత ప్రెస్ మీట్ పెడతా అన్ని విషయాలు చెబుతా అని గంగుల అన్నారు.









