ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే చిన్నారులకు ఇకపై ‘‘సీఎం బ్రేక్ఫాస్ట్’’ పేరుతో తెలంగాణ సర్కార్ కొత్త పథకాన్ని ప్రారంభించింది. శుక్రవారం ఉదయం మహేశ్వరం నియోజకవర్గంలో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని మంత్రులు హరీష్రావు , సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించగా.. సికింద్రాబాద్ పరిధిలోని వెస్ట్ మారేడ్పల్లిలో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
చదువుకునే చిన్నారుల్లో తలెత్తే పౌష్టికాహార లోపాన్ని చెక్ పెట్టాలనే ఉద్దేశంతో సీఎం బ్రేక్ఫాస్ట్ పేరుతో పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ పథకం మెనూలో ఏయే టిఫిన్స్ ఉండనున్నాయో ఇప్పటికే అధికారులు ప్రకటించారు. బ్రేక్ఫాస్ట్ కోసం 45 నిమిషాల సమయం కేటాయించారు. జిల్లాల్లో తరగతులు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఉదయం 8:45 గంటలకు బ్రేక్ఫాస్ట్ ఇవ్వనున్నారు.
హైదరాబాద్ పరిధిలో మాత్రం ఉదయం 8 గంటలకు టిఫిన్ అందిస్తారు. ప్రస్తుతం 119 చోట్ల పథకాన్ని ప్రారంభిస్తుండగా దసరా సెలవులు ముగిసిన తర్వాత రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో పథకాన్ని అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. స్త్రీశిశు సంక్షేమ శాఖల సమన్వయంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 23 లక్షలకు పైగా విద్యార్థులకు లబ్ది చేకూరనుంది. ప్రభుత్వ బడుల్లో ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం ఇవ్వనున్నారు. పాఠశాల సమయానికి 45 నిమిషాల ముందు విద్యార్థులకు అల్పాహారం అందజేయనున్నారు.










