నిజామాబాద్: ఎన్డీఏలో చేరతానని సీఎం కేసీఆర్ వెంటపడ్డారు.. కానీ ఆ ప్రతిపాదనను తాను ఒప్పుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన జనగర్జన సభలో మోదీ మాట్లాడుతూ.. ‘‘GHMC ఎన్నికల తర్వాత కేసీఆర్ ఢిల్లీ వచ్చి కలిశారు. తెలంగాణ పాలన పగ్గాలు మంత్రి కేటీఆర్కు ఇస్తానని కేసీఆర్ చెప్పారు. కేటీఆర్ను ఆశీర్వదించాలని కేసీఆర్ కోరారు. ఇది రాజరికం కాదు.. ప్రజాస్వామ్యమని కేసీఆర్తో చెప్పా. మీరేమైనా రాజులా అని నేను ప్రశ్నించా. ప్రజలు ఆశీర్వదిస్తేనే పాలకులు అవుతారని చెప్పా. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోబోమని కేసీఆర్కు తేల్చి చెప్పా. నాటి నుంచి నా కళ్లలోకి చూడ్డానికి కూడా సీఎం కేసీఆర్ భయపడుతున్నాడు’’ అని మోదీ హెచ్చరించారు..
కేసీఆర్ గతంలో హైదరాబాద్(Hyderabad) ఎన్నికలపుడు నాతో అప్యాయంగా ఉన్నాడు. ఆర్భాటంగా స్వాగతం పలికాడని ప్రధాని మోదీ అన్నారు. ‘ఇప్పుడేమైంది? మా అవసరం తీరాక ఆయన ప్రవర్తన మారిపోయింది. మా కార్యకర్తలను ఎన్ని రకాలుగా వేధించినా భయపడేది లేదు. తెలంగాణను ఓ కుటుంబం దోచుకుంటోంది. ఎంతోమంది బలిదానాలతోనే తెలంగాణ సాకారమైంది. తెలంగాణ వచ్చాక ఒక కుటుంబమే బాగుపడింది. కేసీఆర్ పాలనలో అవినీతి పెరిగింది. కేసీఆర్, ఆయన కుమారుడు… ఆయన కుమార్తె, అల్లుడు మాత్రమే ధనికులయ్యారు. కేంద్రం ఇచ్చిన నిధులనూ బీఆర్ఎస్ దోచుకుంటోంది. కుటుంబ పాలనకు ప్రజలు మరో అవకాశం ఇవ్వొద్దు. కేసీఆర్ కుటుంబ సభ్యులంతా దోపిడీ చేస్తున్నారు. ఉద్యోగాల్లో అసలైన యువతకు అవకాశం రావడం లేదు. నమ్మకం ఉంచి టి.బీజేపీకి అవకాశం ఇవ్వండి. బీఆర్ఎస్(BRS) దోచుకున్నదంతా కక్కిస్తా’’ అని మోదీ పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజల్లో చాలా టాలెంట్ ఉంది. కరోనాకు మందు కనిపెట్టారని మోదీ చెప్పారు. ‘‘నిజాం నవాబులు హైదరాబాద్ను వదలకపోతే ఒకే ఒక్క గుజరాతీ బిడ్డ వల్లబాభాయ్ పటేల్ వారిని తరిమేశారు. ఈ రాష్ట్రంలో కుటుంబ పాలన అవసరం లేదు. వేలాది మంది బలిదానం చేసి సాధించిన రాష్ట్రాన్ని ఒకే కుటుంబం కబ్జా చేసింది. ఇక్కడి ప్రజల కలలను తుంచేశారు. కాంగ్రెస్ వారితో కూడా అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రాదు. బీఆర్ఎస్కు కాంగ్రెస్తో సంబంధం ఉంది. వాళ్లిద్దరు తెరచాటు ఒప్పందాలు చేసుకున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్, బీఆర్ఎస్(Congress, BRS)కు ఇలాగే చీకటి ఒప్పందాలు జరిగాయి. ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణకే వినియోగిస్తున్నారు. రైల్వే, ఆరోగ్య పథకాలు తెలంగాణ ప్రజలకు అంకితం చేశాం. నిజామాబాద్ మహిళలు, రైతులకు ధన్యవాదాలు. మీరు ఇచ్చిన అపురూప స్వాగతంతో ధన్యుడిని. ఈ ఎన్నికల్లో నారీ శక్తి చూపించాలి. మీ ఓట్ల బలంతో వాళ్లు బలవంతులు అయ్యారు’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ప్రజలను మోసం చేస్తున్నారు. మా వాళ్లను గెలిపించండి.. మీ పాదాల దగ్గర ఉంచుతా. బీజేపీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ పాపాలను ఒక్కొక్కటి బయటకు తీస్తాం’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు.









