సిద్ధిపేట ప్రజల దశాబ్ధాల కల నెరవేరేందుకు సమయం ఆసన్నమైంది. సొంత గడ్డపై రైలు ఎక్కాలన్న ప్రజల చిరకాల స్వప్నం సాకారమయ్యే సమయం రానే వచ్చేసింది. మంగళవారం (రేపు) నుంచి సికింద్రాబాద్ – సిద్ధిపేట మధ్య తొలి రైలు కూత పెట్టనుంది. మెదక్ జిల్లా మనోహరాబాద్ – కరీంనగర్ జిల్లా కొత్తపల్లి రహదారిలో కీలక మైలురాయి మంగళవారం ప్రారంభం కానుంది. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు పుష్ పుల్ రైలు సేవలు అందుబాటులో ఉంటాయి. రెండు ప్యాసింజర్ రైళ్లు రేపటి నుంచి సికింద్రాబాద్, సిద్ధిపేటల మధ్య పరుగులు పెట్టనున్నాయి. నిజానికి తొలుత కాచిగూడ – సిద్ధిపేట మధ్య రైలును నడిపించాలని భావించారు.
అయితే సికింద్రాబాద్ నుంచే ప్రజలు పెద్ద ఎత్తున వస్తారన్న కారణంతో సికింద్రాబాద్ నుంచి రైలు సేవలు ప్రారంభించేందుకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఇంతకీ ఈ రైలు ఏయే స్టేషన్స్లో ఆగుతుంది.? ధర ఎంత.? రైలు జర్నీ షెడ్యూల్ ఏంటి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం.. సికింద్రాబాద్ నుంచి సిద్ధిపేటకు రైలు మార్గం మొత్తం 116 కిలోమీటర్ల మేర ఉండనుంది. సికింద్రాబాద్లో బయలుదేరే ప్యాసింజర్ రైలు మల్కాజిగిగి, కెవలరీ బ్యారక్స్, బొల్లారం, గుండ్లపోచంపల్లి, మేడ్చల్, మనోహరాబాద్, నాచారం, బేగంపేట, గజ్వేల్, కొడకండ్ల, లకుడారం, దుద్దెడ, సిద్ధిపేట స్టేషన్స్లో ఆగతుంది. ఇక సికింద్రాబాద్ నుంచి సిద్ధిపేట వరకు రైలు ఛార్జీ రూ. 60గా ఉండనున్నట్లు తెలుస్తోంది.









