చికాగోలోని రోమియోవిల్లే ప్రాంతంలో నివాసముంటున్న ఓ కుటుంబాన్ని దుండగులు కాల్చి చంపారు. చికాగోలో సబర్బన్ హోమ్లో నివశిస్తున్న భార్యాభర్తలు, ఇద్దరు చిన్నారులతోపాటు వారు ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న మూడు కుక్కల్ని ఘోరంగా కాల్చి చంపారని న్యూయార్స్ పోస్ట్ నివేదించింది. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై రోమియోవిల్లే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వారు ఆల్బర్ట్ రోలన్, జోరైడా బార్టోలోమీ, ఆడ్రియల్ (10), డియోగో (7)గా పోలీసులు గుర్తించారు. బంధువుల నుండి వచ్చిన ఫోన్ కాల్స్కి స్పందించకపోవడంతో.. బంధువులే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులకు అనుమానమొచిచ్చి ఆదివారం రాత్రి 8.40 గంటల సమయంలో హత్య జరిగిన ఇంటిని తనిఖీ చేశారు. అప్పుడే ఆ ఇంట్లో భార్యాభర్తలతో సహా, ఇద్దరు చిన్నారుల మృతదేహాలు పోలీసులకి కనిపించాయి. ఇక ఈ ఘటనపై సోమవారం రోమియోవిల్లే పోలీస్ డిప్యూటీ చీఫ్ క్రిస్ బర్న్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఈ కుటుంబం చనిపోయిన తీరుని చూస్తే వారు ఆత్మహత్య చేసుకున్నట్టుగా మేము భావించడం లేదు. ఇది హత్యగానే భావిస్తున్నాము. ఈ హత్య జరిగిన ప్రాంతంలో ప్రమాదం పొంచి ఉందని మేము భావించడం లేదు.
ఇప్పటివరకు ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదు. గడచిన 18 గంటలుగా మేము అనుమానాస్పదమైన వ్యక్తుల్ని ఎవరినీ గుర్తించలేదు. మా డిటెక్టివ్లు, క్రైమ్సీన్ ఇన్వెస్టిగేటర్లు భౌతిక సాక్ష్యాలను సేకరించారు. ఇది యాదృచ్ఛిక సంఘటన కాదు. పక్కా వ్యూహంతోనే వారిని కాల్చి చంపారు.’ అని ఆయన అన్నారు. కాగా, ఈ ఘటనపై రోమియోవిల్లే మేయర్ జాన్ నోక్ స్పందించారు. చిన్నారులతో సహా కాల్చి చంపిన వారిని వదిలిపెట్టము. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అని నోక్ అన్నారు. ఆ ఇద్దరు పిల్లలు రాబర్ట్ సీ హిల్ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకుంటున్నారు.









