రాజ్భవన్ వేదికగా తెలంగాణ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ సమక్షంలో మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం రాత్రి పట్నంకు రెండు శాఖలను గులాబీ బాస్ కేటాయించారు. అయితే తనకు కేటాయించిన శాఖపై పట్నం స్పందించారు. ‘కేబినెట్లో చేర్చుకున్న కేసీఆర్కు ధన్యవాదాలు. మంత్రి పదవితో రాజీ పడినట్టు కాదు. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీపై పరిస్థితిని బట్టి నిర్ణయం ఉంటుంది’ అని మహేందర్రెడ్డి చెప్పుకొచ్చారు. అంటే.. మంత్రి పదవి ఇచ్చినంత మాత్రన రాజీ పడినట్లు కాదని.. పొంగిపోనని.. పోటీపై నిర్ణయం తీసుకుంటానని చెప్పడంతో అధికార పార్టీలో అలజడి నెలకొన్నట్లయ్యింది. కొత్త మంత్రి ఇచ్చిన ఈ ట్విస్ట్తో మరోసారి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు.

కాగా.. తాండూరు ఎమ్మెల్యే టికెట్ను పట్నంను కాదని కాంగ్రెస్ నుంచి కారెక్కిన ఫైలట్ రోహిత్ రెడ్డికి ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు. చాలా రోజులుగా కారు దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు రావడంతో బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత ఫైలట్ రోహిత్ వెళ్లి పట్నంను కలవడం.. ఇద్దరూ వచ్చి మళ్లీ కేసీఆర్ను కలవడం.. అసంతృప్తిగా ఉన్న మహేందర్ రెడ్డిని బుజ్జగించడం.. చివరికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు.. ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామని కూడా కేసీఆర్ మాటిచ్చారట. జాబితాను ప్రకటించిన బీఆర్ఎస్, ఆ అసంతృప్త నేత విషయంలో పట్టు సడలించి మెట్టు దిగింది. మొన్నటిదాకా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి విషయంలో దూరం పాటించినా చివరకు రాజీపడిపోయింది. ఇన్నాళ్లు తాము చెప్పిందే వేదం అన్న రీతిలో వ్యవహరించిన బీఆర్ఎస్ అధినాయకత్వం ఇప్పుడు ధిక్కార స్వరం వినిపించిన పట్నంను అందలమెక్కించింది. చిత్రం ఏమిటంటే ఆయన్ను సాగనంపేందుకు పొగబెట్టిన వారితోనే ఆయన కాళ్లు మొక్కించడం గమనార్హం.









