తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేసీఆర్ కేబినేట్ ఆమోదం తెలిపింది. ఈమేరకు విలీన బిల్లును రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ దగ్గరికి ప్రభుత్వం రెండురోజుల క్రితం పంపించింది. అయినా గవర్నర్ నుంచి ఎలాంటి అనుమతి రాకపోవడంతో కార్మికులు నేడు బస్సుల బంద్కు పిలుపునిచ్చారు. ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సుల బంద్కు కార్మికులు పిలుపునిచ్చారు. ఉదయం 11 గంటలకు పీవీమార్గ్ నుంచి రాజ్భవన్ ముట్టడికి ఆర్టీసీ కార్మికులు బయల్దేరి వెళ్లనున్నారు.
గవర్నర్ తీరుకు నిరసనగా రాజ్ భవన్ ముట్టడికి ఆర్టిసీ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. విలీన బిల్లుకు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ వెంటనే ఆమోదం తెలపాలని కార్మికులు డిమాండ్ చేశారు. డిపోల నుంచి బస్సులు బయటికి తీయొద్దని ఉన్నతాధికారులు డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారు. బందును పకడ్బందీగా నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో రాత్రి వరకే ఆయా డిపోలకు బస్సులను త్వరగా చేరవేస్తున్నారు.









