ఆర్టీసీ విలీనం బిల్లుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదం తెలపలేదని తెలుస్తుంది. ఈ సమావేశాల్లోనే ఆర్టీసీ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది. అయితే ఈ బిల్లు ఆర్థికపరమైన బిల్లు కావడంతో గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపింది. కానీ 2 రోజులు గడుస్తున్నా ఆ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపలేదని..రాజ్ భవన్ నుంచి ఎలాంటి అనుమతి రాలేదని తెలుస్తుంది. దీనితో ఈ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టాలని భావించిన కేసీఆర్ సర్కార్ కు షాక్ తగిలినట్లైంది.
కాగా ఇటీవల కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఒకటి. అలాగే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఆర్టీసీ విలీన ప్రతిపాదనను గవర్నర్ కు పంపించారు. గవర్నర్ ఆ బిల్లును ఆమోదించిన తరువాత సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది. కానీ ఇప్పటివరకు కూడా ఆ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడం గమనార్హం. ఈ బిల్లుపై రాజ్ భవన్ నుంచి ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం అందలేదని తెలుస్తుంది.









