తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. పలుచోట్ల రికార్ఢు స్థాయిలో వర్షం కురువడంతో జనజీవనం అస్తవ్యస్థమైంది. ఇటు, భారీ వరదల కారణంగా చెరువులు, వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో పలువురు గల్లంతు కాగా, కొంతమంది మృత్యువాతపడ్డారు. మరోవైపు.. హైదరాబాద్లో కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో వర్షాలపై అప్రమత్తం కానందుకు అధికార బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు(శుక్రవారం) జీహెచ్ఎంసీ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. వరద బాధితులకు రూ.10వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో, తెలంగాణ పోలీసులు శుక్రవారం ఉదయం నుంచే జీహెచ్ఎంసీ ఎదుట భారీగా మోహరించారు. జీహెచ్ఎంసీకి ఉన్న మూడు గేట్ల దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.









