దేవుడే కాపాడాలన్న మంత్రి
నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్లో ఉంది. కెపాసిటికి మించి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 3.5లక్షల క్యూసెక్కులు కాగా.. అంతకుమించి వస్తున్న వరద వచ్చి చేరింది. మొత్తం 18 గేట్లు ఉండగా.. 4 వరద గేట్లు మొరాయిస్తున్నాయి. 14గేట్లను ఎత్తి 2లక్షల 19వేల క్యూసెక్కుల నీరు గోదావరిలోకి అధికారులు విడుదల చేశారు. మరోవైపు.. కొన్ని ప్రాంతాల ప్రజలు ఇళ్లను ఖాళీ చేస్తున్నారు.
అయితే.. ప్రాజెక్టును పరిశీలించడానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే రేఖా నాయక్, ఉన్నతాధికారులు వెళ్లారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు..ఆ ప్రాంత ప్రజలను తరలించేందుకు హెలికాఫ్టర్లను అధికారులు సిద్ధం చేశారు. అయితే.. గత ఏడాది పరిస్థితి పునరావృతమవుతుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కడెం ప్రాజెక్ట్కు వెళ్లే దారుల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులపైకి వరద పోటెత్తింది. ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి.
ప్రాజెక్ట్ వద్ద పరిస్థితిని పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులతో సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం గేట్లు తెరుచుకోవట్లేదని, దేవుడే కాపాడాలని మంత్రి చెప్పుకొచ్చారు. వరద తగ్గాలని కోరుకున్నారు. తెరుచుకోని గేట్లకు మరమ్మతులు చేసేందుకు నిపుణులను పిలిపిస్తున్నట్లు మంత్రి మీడియాకు వివరించారు. వరద తగ్గితే కట్టమైసమ్మకు మొక్కు చెల్లించుకుంటానంటూ మంత్రి తెలిపారు. కడెం ప్రాజెక్టు వద్ద పోలీసుల ఆంక్షలు విధించారు. కడెంతో పాటు పాండవపూర్ వంతెన వద్ద వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. దీంతో నిర్మల్-మంచిర్యాల రూట్లలో రాకపోకలను అధికారులు నిలిపేశారు.









