కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) భేటీ తర్వాత ఢిల్లీలో ఉన్న పవన్ కళ్యాణ్.. బుధవారం సాయంత్రం అమిత్ షాను కలిశారు. ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. దాదాపు 25 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్, అమిత్ షా సమావేశం జరిగింది.
అమిత్ షాతో సమావేశం అద్భుతంగా జరిగిందన్న పవన్ కళ్యాణ్.. తమ చర్చలు రాష్ట్ర ప్రజల ప్రగతికి దోహదం చేస్తాయని ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిర్మాణాత్మక, నిర్ణయాత్మక సుసంపన్నమైన భవిష్యత్ అందించేందుకు ఈ చర్చలు దోహదపడతాయని పేర్కొన్నారు. ఏపీలో బీజేపీ, జనసేన కూటమి బలోపేతంపై చర్చించామని బీజేపీ నేత మురళీధరన్ ట్వీట్ చేశారు. పవన్, మనోహర్కు ఆతిథ్యం ఇవ్వటం ఆనందంగా ఉందన్నారు.
కాగా, గురువారం కూడా పవన్ కళ్యాణ్ ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఎవరెవరిని కలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో పొత్తుల విషయంపై బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ కీలక చర్చలు జరుపుతున్నారు.









