అన్ని స్థానాలూ మేమే గెలుస్తాం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కు 12 స్థానాలు గెలువబోతున్నామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ రాష్ట్ర వ్యవహరాల ఇన్ ఛార్జి మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి మరికొంత మంది సీనియర్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. భేటీకి ముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ సంచలన కామెంట్స్ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొత్తగా పార్టీలోకి చేరాల్సిన పని లేదని చెప్పారు.
అయితే నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతుండగా.. ఆ పార్టీలో ఆయన గత కొంత కాలంగా అసంతృప్తిలో ఉన్నారు. పార్టీ టికెట్ దక్కటం కష్టమని భావించిన వేముల.. కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు రెడీ అయ్యారు. అయితే ఆయన చేరికను కోమటిరెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. వేములతో పాటు కోదాడకు చెందిన శశిధర్ రెడ్డి కూడా కాంగ్రెస్ వైపు చేస్తుండగా.. అక్కడ సీనియర్ నాయకుడు, ఎంపీ ఉత్తమ్ సతీమణి పద్మావతి ఇంఛార్జ్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేరికను కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీశాయి.









