జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వానలతో సింగరేణి ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓపెన్ కాస్ట్ కేటీకే 2, 3 గనుల్లో 7,025 టన్నుల బోగ్గుఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో సింగరేణి కాలరీస్కు రూ.1.72 కోట్లు నష్టం వాటిళ్లింది. భారీ వర్షాల నేపథ్యంలో 1.63 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు ఆగిపోయాయి.
రాష్ట్రంలో రాగల ఐదురోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం నుంచి బుధవారం వరకు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. ఈ మేరకు ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది.









