కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి సుప్రీంకోర్టులో మంగళవారం కాస్త శుభవార్త వినిపించింది. ‘ఇంటి పేరు మోదీ’ కేసులో తనకు వ్యతిరేకంగా గుజరాత్లోని సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన అప్పీల్ను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. సూరత్ కోర్టు తీర్పును నిలిపేసేందుకు హైకోర్టు తిరస్కరించడాన్ని ఆయన సవాల్ చేశారు.
ఈ అపీలుపై అత్యవసర విచారణ జరపాలని రాహుల్ గాంధీ తరపు న్యాయవాది సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టును కోరారు. ఈ నెల 21న లేదా ఈ నెల 24న దీనిపై విచారణ జరపాలని కోరారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై ఈ నెల 21న విచారణ జరిపేందుకు అంగీకరించింది.
తనకు వ్యతిరేకంగా క్రింది కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపేయకపోతే వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ, స్వేచ్ఛాయుత ఆలోచనలకు విఘాతం కలుగుతుందని రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.









